Publish Date: Thu, 07 May 2020 (22:07 IST)
Updated Date: Thu, 07 May 2020 (22:09 IST)
తెలుగునాట కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్తో పేదలకు ఉపాధి కరవై నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సాయం చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉప్పలంలోని మత్స్యకార గ్రామమైన ఏకువూరులో మత్స్యకారులకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేసింది.
గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్తో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా దెబ్బకు ఉపాధి కరవై ... తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు నిత్యావసరాలు పంపిణీ చేయడం పట్ల గ్రామ ప్రజలు నాట్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోంపేట మాజీ జడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, గ్రామ మాజీ సర్పంచ్ బడే తమ్మరావు, మాజీ ఎంపీటీసీ మాగుపల్లి పాపారావు, బడే సూర్యనారాయణ, వాసుపల్లి కృష్ణారావు, బడే ఈశ్వరరావు పాల్గొని నాట్స్, గ్లో సంస్థలకు అభినందనలు తెలియజేశారు. తెలుగునాట పేదలు ఎక్కడ ఇబ్బంది పడుతున్న ఆ విషయాన్ని తమ దృష్టికి తెస్తే వారికి తమ వంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటామని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.