Publish Date: Sat, 28 Mar 2020 (14:45 IST)
Updated Date: Sat, 28 Mar 2020 (14:47 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని శరవేగంగా చుట్టేస్తోంది. ఈ వైరస్ బారినపడి అనేక మంది చనిపోతున్నారు. అయితే, ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే కేవలం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఏకైక మార్గమని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఓ చిట్కా చెప్పారు. ఈ చిట్కాను పాటిస్తే కరోనా వైరస్ బారినపడకుండా ఉంటారని ఆయన సలహా ఇస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రెండు పోస్టులు చేశారు.
"కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది... అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం" అని తెలిపారు.
"మీది కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయ్యండి. తద్వారా ఆ చేతితో ముఖాన్ని తాకడం తగ్గుతుంది. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుంది. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి" అని లోకేశ్ ట్వీట్లు చేశారు.