Publish Date: Fri, 25 Dec 2020 (22:20 IST)
Updated Date: Fri, 25 Dec 2020 (22:22 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే సీఎం సతీమణి వైఎస్ భారతి, వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ...క్రిస్మస్ తో పాటు వైకుంఠ ఏకాదశి కలిసి రావడం శుభదినం. ఇవాళ 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. పులివెందులలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోవడం బాధాకరం. పట్టాలు ఇవ్వొద్దని నిన్న ఎవరో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు.
ఏపీఐఐసీ భూములు పేదలకు ఇవ్వొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు వస్తే అక్కడ పనిచేసే ప్రజలకు ఇళ్లు ఉండాలి. అందుకే అక్కడ పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. కోర్టు స్టే ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు. పులివెందుల ప్రజలకు కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇస్తాం అని తెలిపారు.