Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రాభివృద్ధే మా అజెండా - విమర్శలను పట్టించుకోం: మంత్రి బుగ్గన

రాష్ట్రాభివృద్ధే మా అజెండా - విమర్శలను పట్టించుకోం: మంత్రి బుగ్గన
, గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:15 IST)
సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో వస్తున్న అసత్య ప్రచారాలు, కథనాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్భంగా వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి బుగ్గ‌న మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చడానికి కొన్ని ప్రధాన పత్రికలు, మీడియా ఛానళ్లు, రాజకీయ నాయకులు పనిగట్టుకొని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

అనంతపురంలో కొనసాగుతున్న కియా మోటార్స్ సంస్థ (కార్ల తయారీ కంపెనీ) తమిళనాడుకు తరలిపోతుందని పేర్కొంటూ కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు రాశారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాంటి తప్పుడు ప్రచారాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే కియా పరిశ్రమను ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో కంపెనీ ప్రతినిధులు సీఎంతో పాటు తనతోనూ మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు.

పరిశ్రమ అద్భుతంగా పనిచేస్తూ కియా కార్లను ఉత్పత్తి చేస్తోందని, మార్కెట్లో కియా కార్లకు గుర్తింపు వచ్చిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రూ. 14 వేల కోట్ల పెట్టుబడితో కియా ప్లాంటు ఏర్పాటు చేశారని, పరిశ్రమల శాఖ నుంచి కియాకు పూర్తి సహకారం అందించామని మంత్రి చెప్పారు.

కియా పరిశ్రమ నిర్వాహకులు చాలా సంత‌ృప్తిగా ఉన్నారనే విషయాన్ని మంత్రి  గుర్తుచేశారు. తాము పనిమాత్రమే చేస్తామని, గత ప్రభుత్వం మాదిరి  ప్రచారాన్ని ఆశించకపోవడం వల్లే తప్పుడు ప్రచారాలు తమపై చేస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా వార్తా కథనాలు రాస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.
 
వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులపై ఐఈఎమ్‌ డాక్యుమెంట్‌ ప్రకారం 2019 అక్టోబర్‌ వరకు రూ.15953 కోట్లు పెట్టుబడులు పెడతామంటే రూ.32 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు.

ఈ ఒక్క సంవత్సరంలోనే ఇది. 2018లో రూ.19800 కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకొస్తే రూ.9500 కోట్లు మాత్రమే వచ్చాయి. 2017లో రూ. 4500 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది ఐఈఎమ్‌ డాక్యుమెంట్‌. బేసిక్‌ డేటా ఇది.

అంతకుముందు నాలుగేళ్ళు ఎలా ఉన్నాయో చూశారు కదా... తాము పనిచేసుకుంటూ పోతున్నాం తప్ప అడ్వర్టైజ్  మెంట్‌ చేయడం లేదని మంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం 1252 కంపెనీలకు ఏపిఐఐసీ 1057 ఎకరాలు భూకేటాయింపులు చేసిందని చెప్పారు.

ఇది కాకుండా ముఖ్యమైన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని వివరించారు. బిర్లా గ్రూప్‌కు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌. స్మార్ట్‌ కెమ్‌ టెక్నాలజీస్, ఏటీసీ టైర్స్, సీఆర్‌ఆర్‌ కార్పోరేషన్‌ ఫర్‌ మెట్రో కోచెస్, హ్యుండయ్‌ స్టీల్స్, పాస్కో స్టీల్స్‌ ఇవన్నీ ముందుకొచ్చాయి, చర్చలు జరుగుతున్నాయన్నారు.

అదే విధంగా జూన్‌ నుంచి నవంబర్‌ 2019 వరకు 19 యూనిట్లు గ్రౌండ్‌ అయితే రూ.15,600 కోట్లు పెట్టుబడి గ్రౌండ్‌ అయిందని వివరించారు. అదే విధంగా 8 యూనిట్లు రూ.7900 కోట్లతో ట్రయల్‌రన్‌కు రెడీగా ఉన్నాయని తెలిపారు.

మరో 8 యూనిట్లు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇదీ తమ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధని...తాము ప్రచారానికి దూరంగా లోప్రోఫైల్‌గా చేయాల్సిన పనిచేస్తున్నామని వెల్లడించారు. 
 
గత ఐదేళ్లలో పరిశ్రమలకు ఇన్సెంటివ్ విషయంలో రూ.3,500  కోట్ల మేర రాయితీలను చెల్లించలేదని.. దాన్ని బట్టే పరిశ్రమల ప్రోత్సహకంపై గత ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని మంత్రి వివరించారు.

గత ప్రభుత్వం డీపీఆర్ లు లేకుండానే రూ.లక్ష కోట్లకు టెండర్లు పిలిచించిదని మంత్రి  గుర్తుచేశారు. గతంలో రూ.40 వేల కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రస్తుతం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాటిని తమ ప్రభుత్వం పరిష్కరించుకుంటూ పోతుందని మంత్రి వివరించారు.

తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి సివిల్ సప్లయి కార్పొరేషన్, విద్యుత్ డిస్కం లపై రూ.20 వేల కోట్లకు పైగా అప్పులున్నాయని.. వాటిని చెల్లిస్తూనే సమర్థవంతంగా ఆయా సంస్థలను పనిచేయించేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పుడున్న అప్పులు, చెల్లిస్తున్న బకాయిలు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం తదితర అంశాలపై మంత్రి సవివరంగా గణాంకాలను మీడియాకు వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి వివరణనిచ్చారు.

కావాలని పదే పదే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మీడియాకు, విపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. ఏ ప్రభుత్వమైనా ఎఫ్ఆర్ బీఎం చట్టానికి అనుగుణంగానే అప్పులు చేస్తుందన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తిని, ఆదాయ జమలను మార్జినల్ గా చూపి రూ.38వేల కోట్లు అప్పు చేసుకునే అవకాశం రాష్ట్రానికి ఉందని మంత్రి ఉదహరించారు. రెవెన్యూ ఆదాయాన్ని బట్టి లక్ష కోట్ల వరకూ అప్పు  తీసుకుంటే రాష్ట్రప్రభుత్వం దానికి గ్యారంటీ ఇవ్వొచ్చన్నారు.  

15వ ఆర్థిక సంఘం నుంచి జనాభా, అరణ్యశాతం, పేదరికం లాంటి తదితర అంశాలను బట్టి నిధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ కు సరైన జనాభా లేకపోవడం వల్ల, జనాభా నియంత్రణ పాటించడం వల్ల వచ్చే నిధుల శాతం కూడా తగ్గిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రాబట్టలేదని కొందరు రాజకీయం చేయడం తగదన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వడం వల్ల దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా జనాభా తగ్గడం వల్ల ఏపికి 0.02 శాతం తగ్గిందని వివరించారు.

ఉదాహరణకు కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు కూడా తగ్గింది. దానికి కూడా తామే కారణమా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జీడీపీ హెచ్చు తగ్గుల రాష్ట్రాల వివరాలను మంత్రి వివరించారు. దేశంలో తలసరి ఆదాయం తగ్గడం ద్వారా రాష్ట్రంలో అదే పరిస్థితులు ఉన్నాయన్నారు.

రాష్ట్రాల పరిధిలోకి వస్తే మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గానే ఉందని వెల్లడించారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా గతంలో ఉన్న పెండింగ్ బిల్లులను ప్రాధాన్యత వారీగా చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు.

ఇప్పటివరకూ ఆరోగ్య శ్రీ, వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ, అవుట్ సోర్సింగ్ ల బకాయిలను చెల్లింపు చేశామని, ప్రధానంగా డిసెంబర్ నాటికి ఆరోగ్యశ్రీ పూర్తి బిల్లులను క్లియర్ చేశామని చెప్పారు.

రూ.40వేల కోట్ల అప్పులకు గానూ రూ.20 వేల కోట్లకు తగ్గించామన్నారు. పదే పదే తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా చెప్పాలని హితవు పలికారు.

ప్రత్యేకహోదా డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని, మొదటినుండి తమ ప్రభుత్వం అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి కొత్తగా 3 బిలియన్‌ డాలర్ల రుణం: ఏఐఐబీ