Publish Date: Tue, 10 Sep 2019 (15:14 IST)
Updated Date: Tue, 10 Sep 2019 (15:18 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అయిన చింతా మోహన్ జోస్యం చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తోందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, ఈ అంశానికి సంబంధించి తనకు రహస్య సమాచారం అందిందని వెల్లడించారు.
అదేసమయంలో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి స్థానంలో తిరుపతి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతిని వదిలి తిరుపతికి రావాలని సూచించారు. రాష్ట్ర రాజధానిగా తిరుపతి అన్ని విధాలా అనువైనదని చెప్పారు.
అమరావతికి వరద ముప్పు ఉందని... రాజధానిగా ఆ ప్రాంతం అనువైనది కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.