Publish Date: Mon, 29 Jul 2024 (09:37 IST)
Updated Date: Mon, 29 Jul 2024 (09:39 IST)
ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
పథకం అమలుకు సంబంధించిన అంశాలపై అధికారులు తమ నివేదికను అందజేయనున్నారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తీరును అధ్యయనం చేసేందుకు అధికారులు వెళ్లారు.
సోమవారం జరిగే సమావేశంలో ఉచిత బస్సు సౌకర్యం నిబంధనలపై ప్రభుత్వం చర్చించనుంది. ఏపీఎస్సార్టీసీ నెలకు దాదాపు 250 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఎదుర్కొంటుంది. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా.
ఎంపిక చేసిన కేటగిరీ సర్వీసుల్లోనే ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకాన్ని విజయవాడ, విశాఖపట్నంలలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సిటీ బస్సు సర్వీసులకే పరిమితం చేయాలని అధికారులు సిఫార్సు చేసే అవకాశం ఉంది.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు ప్రస్తుతం ఉన్న 70 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని కూడా వారు అభిప్రాయపడ్డారు.