Publish Date: Mon, 06 Jan 2020 (16:45 IST)
Updated Date: Mon, 06 Jan 2020 (16:48 IST)
తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు అమరావతి పోరాటానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్రజలు చేపడుతున్న ఆందోళనకు విపక్ష పార్టీలన్నీ మద్దతివ్వాలని చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే.
మరోవైపు అమరావతి ఐకాస నిర్వహణ ఖర్చుల కోసం ప్రజలే విరాళాలివ్వాలని చంద్రబాబు కోరారు.దీంతో రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు సంఘీభావంగా తొలుత ఓ మహిళ 4 బంగారు గాజులు అందించారు. చంద్రబాబు చేతులమీదుగా ఐకాస నేతలకు ఇచ్చారు.
శాంతి అనే మరో మహిళ రూ.10,116 విరాళంగా ఇచ్చారు. గతంలో రాజధాని అభివృద్ధి కోసం ఈమె రూ. లక్ష ఇచ్చారు. విజయలక్ష్మి అనే మహిళ మెడలోని బంగారు నల్లపూసల గొలుసును విరాళంగా ఇచ్చారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. అమరావతిని కాపాడుకోకపోతే మనం చనిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.రాజధాని అంటే ఆటలు కాదని, మట్టిని నమ్ముకొని బతుకుతున్న మహిళలు, రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.