Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యన్నపాత్రుడికి బెయిల్‌ - అయినా జిల్లాకురాని మాజీ మంత్రి

అయ్యన్నపాత్రుడికి బెయిల్‌ - అయినా జిల్లాకురాని మాజీ మంత్రి
, సోమవారం, 6 జనవరి 2020 (15:23 IST)
పోలీసులను దూషించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఈనెల 3న కోర్టు ముందస్తు  బెయిల్‌ మంజూరు చేసింది. విభేదాల కారణంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు, స్థానిక మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. 
 
ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడి కుమారుడు గత నెల 12న తన ఇంటిపై జెండా కట్టేందుకు సన్నద్ధమయ్యాడు. జెండా కట్టవద్దంటూ దివంగత లచ్చాపాత్రుడి కుమార్తెలు అడ్డు తగలడంతో వివాదం రాజుకుంది. తనకు మాజీ మంత్రి కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని వరుణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వరుణ్‌ మీద లచ్చాపాత్రుడు కుమార్తె లక్ష్మి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ నేపథ్యంలో అయ్యన్న నివాసం వద్ద ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహించిన మాజీ మంత్రి అయ్యన్న  అనుమతి లేకుండా నాఇంటికి ఎలా వచ్చారంటూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దూషించి, విధులకు ఆటంకం కలిగించారని గత నెల 20న పోలీసులు... అయ్యన్నపై 353, 506, 504, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
అప్పటి నుంచి జిల్లాకు రాకుండా తన చిన్న కుమారుడి పెళ్లి పనుల పేరుతో అయ్యన్న ఇతర ప్రాంతాల్లో మకాంవేశారు. ఇదే సందర్భంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్పీని కలిసి అయ్యన్నపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ ఫిర్యాదు చేశారు. 
 
అయ్యన్న జిల్లాకు ఎప్పుడొచ్చినా అరెస్టు చేసేందుకు జిల్లా పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారనే సమాచారం తెలియడంతో ముందస్తు బెయిల్‌ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ నెల 3న అయ్యన్నకు బెయిల్‌ మంజూరు చేసింది. అయ్యన్నపాత్రుడు సోమవారం నర్సీపట్నం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనం బతికుండి కూడా చనిపోయినట్లే: చంద్రబాబు