Publish Date: Sun, 22 Sep 2019 (18:13 IST)
Updated Date: Sun, 22 Sep 2019 (18:15 IST)
గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అది కూడా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య కావడం చర్చకు తావిస్తోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజనీ మధ్య ఓ కార్యక్రమంలో విబేధాలు తలెత్తాయి.
మేడికొండూరు మండలం తురకపాలెంలో మసీదు శంకుస్థాపన కోసం మహిళా ఎమ్మెల్యేలు ఇద్దరూ విచ్చేశారు. అయితే తన నియోజకవర్గం పరిధిలోని కార్యక్రమానికి చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ రావడంపై స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి అసహనం వ్యక్తం చేశారు.
ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. తోటి ఎమ్మెల్యే అలా ప్రవర్తించినా.. సహనంతో మసీదు శంకుస్థాపన కార్యక్రమాన్ని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ కొనసాగించడం విశేషం. ఎమ్మెల్యే శ్రీదేవి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయి ముస్లింలను అవమానించారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.