Publish Date: Thu, 05 Sep 2019 (22:28 IST)
Updated Date: Thu, 05 Sep 2019 (22:34 IST)
టిటిడి పాలకమండలిలో పదవి అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక అత్యుత్తమమైన పదవి. రెండేళ్ల కాలపరిమితి అయినా సరే ఆ పదవిలో ఉండడమంటే ఒక హోదా. గౌరవంగా భావిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది తిరుమలకు వచ్చి వెళ్ళే ప్రాంతం. ప్రముఖులతో పరిచయాలు ఈజీగా ఏర్పడడానికి ఇదొక మార్గం.
అయితే ప్రస్తుతం టిటిడి పాలకమండలిలో సభ్యులకు సంబంధించి ఎవరిని నియమించాలన్న విషయంపై చర్చ జరుగుతోంది. దాంతో పాటు నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో పాలకమండలి సంఖ్యను 16 నుంచి 25కి చేశారు. ఇది కాస్త ఆశావహులకు ఇంకా ఆశను రేకెత్తిస్తోంది. నామినేటెడ్ పదవుల్లోనే అతి కీలకమైన పదవి కావడంతో ఈ పదవి కోసం పోటీలు పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎపిలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే కాదు తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పలువురు రాజకీయ నేతలు పోటీలు పడుతున్నారట.
ఇప్పటికే తమకు జగన్తో ఉన్న పరిచయాలతో కొంతమంది, మరికొంతమంది జగన్తో క్లోజ్గా ఉన్న నేతలతో రెకమెండేషన్ చేయించుకుని పదవులను పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల కన్నా ఎపిలో ఉన్న వారికే ఎక్కువగా సీట్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నారట జగన్. దీంతో ఎపిలో ఉన్న కొంతమంది కీలక వైసిపి నేతలు జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. జగన్ పర్యటన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాలిపోతున్నారట.