Publish Date: Wed, 20 May 2020 (09:49 IST)
Updated Date: Wed, 20 May 2020 (09:51 IST)
విద్యుత్ ఛార్జీలు పెంపుకు వ్యతిరేకంగా ఈ నెల 31 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఏమిటో ఇంతవరకు ప్రకటించలేదని తెలిపారు.
ప్రకటన చేయకపోతే ఉమ్మడి కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుందని, గతంలో మాదిరిగా విద్యుత్ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావుతో కలిసి ఆయన మాట్లాడారు.
విద్యుత్ ధరలను నెలవారీ శ్లాబులుగా నిర్ణయించినందున వినియోగాన్ని బట్టి ఏ నెలకానెల ధరలు మారుతుంటాయని, దీనివల్ల ఎక్కువ మంది పేదలు నష్టపోతారని తెలిపారు.
దీనిపై నిరసన వ్యక్తం చేసేందుకు వస్తే పోలీసులు కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేసి రిమాండుకు పంపిస్తే న్యాయమూర్తి పోలీసులకు చీవాట్లు పెట్టారన్నారు.