Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టపర్తిలో కరోనా భయం... ప్రశాంతి నిలయంలో ఆంక్షలు

Advertiesment
Corovavirus
, సోమవారం, 16 మార్చి 2020 (11:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కరోనా భయం నెలకొంది. ప్రశాంతి నిలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలా వచ్చిన ఓ విదేశీయుడుకి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీంతో పుట్టపర్తివాసులు హడలిపోతున్నారు. 
 
నిజానికి సత్యసాయి సమాధాని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. తాజాగా రష్యాకు చెందిన ఓ వ్యక్తి పుట్టపర్తికి వచ్చాడు. అతను దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుడటతో స్థానిక ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
 
ఈ క్రమంలో సత్యసాయి ట్రస్ట్ అప్రమత్తమైంది. ప్రశాంతి నిలయంలో ఆంక్షలు విధించారు. సత్యసాయి సమాధిని భక్తులెవరూ తాకవద్దని స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు. మరోవైపు పుట్టపర్తిని సందర్శిస్తున్న విదేశీ భక్తులు, పర్యాటకుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 
 
రాజధాని ఎక్స్‌ప్రెస్ నిలిపివేత 
మరోవైపు, రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు విదేశీయుల కారణంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ అరగంటకు పైగా నిలిచిపోయింది. బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎ-5 కోచ్ బెర్త్ నంబరు 8, 10లలో ఇద్దరు రష్యన్లు ప్రయాణిస్తున్నారు. వారిని చూసిన తోటి ప్రయాణికులు అనుమానించారు. విదేశీయులు కావడంతో వారికి కరోనా సోకి ఉంటుందని భావించారు. వారి హంగామాతో పాట్నా స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది.
 
ఈ విషయం తెలిసిన రైలులోని వైద్య బృందం రష్యన్ల వద్దకు చేరుకుని పరీక్షలు నిర్వహించింది. వారిలో కరోనా లక్షణాలు లేవని నిర్ధారించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రైలు గమ్యానికి బయలుదేరింది. రష్యన్లను చూసి వారిని కరోనా బాధితులుగా ప్రయాణికులు భావించారని, అయితే వారిలో కరోనా లక్షణాలు లేవని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్‌ 3వరకు వరంగల్‌ నిట్‌కి సెలవులు