Publish Date: Fri, 20 Oct 2023 (09:09 IST)
Updated Date: Fri, 20 Oct 2023 (09:10 IST)
స్కిల్ డెవెలప్మెంట్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన వ్యాజ్యంలో ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి శుక్రవారం ఆఖరిరోజు. గత మంగళవారం వాదనలు ముగించి వాయిదా వేసిన తీర్పును ధర్మాసనం ఎప్పుడు వెలువరిస్తుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. శనివారం నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. 30వ తేదీన న్యాయస్థానం పునఃప్రారంభమవుతుంది.
ఈ నేపథ్యంలో పూర్వ వాదనలను స్వీకరించిన తర్వాతే ఈ కేసులో తీర్పును వెలువరిస్తుందా లేదా దసరా సెలవుల తర్వాత విచారిస్తుందా అన్న అంశంపై ఇపుడు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ కేసులో ప్రభుత్వ సీఐడీ అధికారులు తమ పూర్వ వాదనలు సమర్పించేందుకు చివరి నిమిషం వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. కోర్టు పని వేళలు ముగిసే చివరి నిమిషానికి ముందు వీటిని దాఖలు చేసే అవకాశం ఉందని, తద్వారా ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించకుండా మరో కొంతకాలం అంటే దసరా సెలవుల తర్వాత తీర్పు వచ్చేలా చేయాలన్నదే వారి వ్యూహంగా ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగానే సీఐడీ తరపు న్యాయవాదులు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.