Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో గద్దలు... రూ.2096 కోట్ల నిధులుంటే.. మిగిలింది రూ.7 కోట్లే...

pawan

వరుణ్

, బుధవారం, 26 జూన్ 2024 (18:47 IST)
2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. బుధవారం మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్‌కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. 2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్ళాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని ఉప ముఖ్యమంత్రివర్యులు అధికారులను ఆదేశించారు. 
 
ఆ ఆర్థిక సంవత్సరంలో కేంధ్ర ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. రూ.46 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయి. ఖర్చు రూ.209 కోట్లు మేర చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. 
 
స్వచ్ఛాంధ్ర నిధులనూ వదల్లేదు 
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమయితేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని ఉపముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సదుద్దేశంతో, ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారని అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా, ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 
అందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఆయ్యేనాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.3 కోట్లు మిగల్చడమే ఉదాహరణ అన్నారు. దీన్నిబట్టే వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. 
 
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే... ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని, గత ఐదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ., ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!