Publish Date: Tue, 27 Aug 2019 (21:52 IST)
Updated Date: Tue, 27 Aug 2019 (21:54 IST)
కృష్ణా జిల్లా కంచికచర్లలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని పేరకలపాడులో ఈతకు వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు.
గుజ్జర్లంక గణేష్ (8), శ్రీమంతు (5), గౌతమ్ (4) ముగ్గురూ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం కర్ణాటక వెళ్లగా.. చిన్నారులు నాయనమ్మ వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. మధ్యాహ్నం బహిర్భూమి కోసం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు.
ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత ఒకరు అందులో మునిగి చనిపోయారు. దూరం నుంచి గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామస్థులు, పోలీసులు చెరువులో సుమారు గంటసేపు గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
మృతిచెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నందిగామ గ్రామీణ సీఐ సతీష్, ఎస్సై శ్రీహరి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను చుసిన స్థానికులు కంటతడి పెట్టారు.