Publish Date: Sat, 25 Jan 2020 (08:24 IST)
Updated Date: Sat, 25 Jan 2020 (08:25 IST)
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి సీఎం జగన్ అదనంగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖలను కేటాయించారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా మంత్రి గౌతమ్రెడ్డి సీఎం జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనపై నమ్మకంతో అదనంగా శాఖలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు, వాణిజ్యం, ఐ.టీ, జౌళి శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తుండగా ఆయనకు కొత్తగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖను కూడా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ద్వారా ప్రభుత్వంపై యువతకు ఉన్న విశ్వాసాన్ని పెంచేలా పనిచేస్తానని మంత్రి వెల్లడించారు. ఉపాధి, నైపుణ్య శిక్షణలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర యువత ఆలోచనలు ప్రతిబింబించేలా ముందుకువెళతానని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రపంచస్థాయి కోర్సులను రాష్ట్ర యువతకు అందించి.. వల్డ్ క్లాస్ వర్క్ ఫోర్స్ ని తయారు చేయడానికి కృషిచేస్తానన్నారు. ఇప్పటికే 4 శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మేకపాటి మరో శాఖను చేపడుతున్నారన్న సమాచరం తెలుసుకున్న ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, అధికారులు ఆయనను ఫోన్ ద్వారా అభినందనలు, శుభాకాంక్షలతో ముంచెత్తారు.