Publish Date: Wed, 03 Apr 2019 (12:29 IST)
Updated Date: Wed, 03 Apr 2019 (12:30 IST)
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అదీకూడా జనసేన పార్టీ తరపున కాదు సుమా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి తన కోడలు ఉపాసనకు స్వయానా చిన్నాన్న. అందుకే ఆయన తరపున ప్రచారం చేయాలని చిరంజీవి భావిస్తున్నారు.
తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపును ప్రచారాన్ని నిర్వహించాలని చిరు నిర్ణయించారని, ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు, మంగళవారం చిరంజీవిని కొండా విశ్వేశ్వర రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య ఎన్నికల ప్రచార ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఈనెల 8వ తేదీన ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడుగా, కేంద్ర మాజీ మంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే.,