Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మసూద్‌కు ఇక మూడినట్టే : ఇండియాకు డ్రాగన్ కంట్రీ ఫుల్‌సపోర్టు

Advertiesment
UN Security Council
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:44 IST)
జైషే మహ్మద్ అధ్యక్షుడు మసూద్ అజార్‌కు ఇక మూడినట్టే. పుల్వామా ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చేసిన తీర్మానానికి చైనా సంపూర్ణ మద్దతు తెలిపింది. 
 
ఈ నెల 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తీవ్రమైనదిగా, పిరికిపందల చర్యగా పేర్కొంటూ యూఎన్ఎస్‌సీ తీర్మానం చేసింది. 
 
ఈ దుశ్చర్య వెనుక కుట్రదారులను, నిర్వాహకులను, ఆర్ధికంగా సహకరించిన వారిని పట్టుకుని చట్టం ముందుకు తీసుకురావాలని పేర్కొంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం సహా సంబంధిత అధికారులకు అన్ని దేశాలు చురుగ్గా సహకరించాలని యూఎన్ఎస్‌సీ సూచించింది. తీవ్రవాద చర్యలకు ఎవరు ఉపక్రమించినా అది నేరమేననీ, దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని జైషే మహ్మద్ పేరును ప్రస్తావిస్తూ స్పష్టం చేసింది.
 
కాగా, ఈ ఉగ్రదాడిని ఇప్పటికే అమెరికా సహా పలు అరబ్ దేశాలు సైతం పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించాయి. మరోవైపు జైషే మహ్మద్‌ చీఫ్ మసూద్ అజర్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు అడ్డుపడుతూ వస్తున్న చైనా సైతం పుల్వామా దాడిని ఖండిస్తున్నట్టు ఈ నెల 15న ప్రకటించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించరాదని స్పష్టం చేసింది. 
 
తాజాగా మసూద్ నేతృత్వంలోని జైషే మహ్మద్ పేరును ప్రస్తావిస్తూ ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానానికి సైతం చైనా మద్దతు తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ చైనా అండతో తప్పించుకు తిరుగుతున్న మసూద్ అజర్‌కు ఇక కష్టాలు తప్పవని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మస్కిటో రిపెల్లెంట్‌లో మంటలు.. బుల్లితెర నటి ఇంట్లో నిప్పులు