బాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోయిన్ రెజీనా కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్కు దక్షిణాది నటీనటుల అవసరం ఎంతో ముఖ్యమన్నారు. చిత్రపరిశ్రమలో దక్షిణాది నటీనటులకు ఉండే అవకాశాలపై ఆమె స్పందించారు.
'బాలీవుడ్ వాళ్లకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. గతంలో గడ్డు పరిస్థితులు ఉండేవి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తారలకు అక్కడ అవకాశాలు దొరకడం ఎంతో కష్టంగా ఉండేది. అప్పట్లో మీరు సౌత్ నుంచి వచ్చారని తెలిస్తే ఛాన్సులు ఇచ్చేవాళ్లు కాదు. దానికి భాషాపరమైన ఇబ్బందులు కూడా ఓ కారణమై ఉండొచ్చు. కానీ, కరోనా తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి.
సౌత్కు చెందిన సినీతారలకు ఇప్పుడు వాళ్లు కూడా అవకాశాలు ఇస్తున్నారు. తమ చిత్రాలను ఎక్కువమంది ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం కోసం వారు దక్షిణాది తారలను ఎంచుకోవడం అవసరంగా మారింది' అని చెప్పారు. బాలీవుడ్లో ప్రాజెక్టులు చేయడంపై మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందులు ఏవీ తాను ఎదుర్కోలేదన్నారు. తానొక బాలీవుడ్ ప్రాజెక్ట్కు సంతకం చేశానని త్వరలోనే దాని విశేషాలు పంచుకుంటానని అన్నారు.
రెజీనా నటించిన తాజా చిత్రం విదాముయార్చి. అజిత్ హీరోగా దర్శకుడు మగిళ్ తిరుమేని రూపొందించారు. త్రిష కథానాయిక. అర్జున్ కీలక పాత్ర పోషించారు. ఇందులో అర్జున్కు రెజీనా జోడీగా కనిపించనున్నారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలకానుంది.