Publish Date: Wed, 03 Feb 2021 (16:14 IST)
Updated Date: Wed, 03 Feb 2021 (16:36 IST)
సాధారణంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల సరసన అవకాశం కోసం హీరోయిన్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అదీకూడా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరు. కానీ, మలయాళ బ్యూటీ నయనతార మాత్రం మెగా ఆఫర్ను తిరస్కరించింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులోకి రీమేక్ కానుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్పై ఆర్బీ చౌదరి.. ఎన్వీప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
ఇది చిరంజీవి కెరీర్లో153వ చిత్రం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో మిగతా పాత్రల్లో ఎవరెవరు నటిస్తారనే విషయాలపై టాలీవుడ్లో అనేక ఊహాగానాలున్నాయి. మొదట ఈ చిత్రంలో లేడి సూపర్ స్టార్ నయన తారను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే సైరా నరసింహారెడ్డితో జతకట్టింది. దీంతో ఈ జోడి మరోసారి అందరినీ అలరిస్తారని అనుకున్నారు.
అయితే నయనతార ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వాస్తవానికి ఒరిజినల్ వర్షన్లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ను, ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకొని తెలుగు వర్షన్లో హీరోయిన్ పాత్రను దర్శకుడు చేర్చినట్లు సమాచారం. ఈ పాత్రను నయన్ రిజెక్ట్ చేయడంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ వేటలోపడినట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.