Publish Date: Fri, 09 Jun 2023 (10:16 IST)
Updated Date: Fri, 09 Jun 2023 (10:17 IST)
మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరులో రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన నల్లగొండ లేదా మల్కాజిగిరిలో ఏర్పాటు చేసే బహిరంగసభకు హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అధినాయకత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించతల పెట్టిన బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారని, ఈ నేపథ్యంలో కనీసం లక్ష మంది జనసమీకరణ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో పలువురు సీనియర్ నాయకులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గురువారం సమీక్షించారు. శుక్రవారం ఖమ్మం వెళ్లి పార్టీ స్థానిక నాయకులతో ఆయన సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో చేరికలను పెంచి.. పార్టీని బలోపేతం చేసే క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో 15వ తేదీన బహిరంగసభ నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా బండి సంజయ్ శుక్రవారం ఏర్పాట్లపై సమీక్షిస్తారని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.