Publish Date: Sat, 01 Jun 2019 (12:22 IST)
Updated Date: Sat, 01 Jun 2019 (12:24 IST)
భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. తంజావూరులోని ఈ ఆలయం పేరు బృహదీశ్వరాలయం.
13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. భారతదేశంలో 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇదే.
ఇక్కడి శివలింగం ఎత్తు 3.7 మీటర్లు కాగా నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ ఆలయ విశేషం. మనం మాట్లాడుకునే శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి.
అసలు అవి అలా ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీనే. వేయి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి, అయితే ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.