Publish Date: Sat, 02 Nov 2019 (22:31 IST)
Updated Date: Sat, 02 Nov 2019 (22:32 IST)
పరమేశ్వరునికి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరమైనదని తెలిసిందే. ఈ కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఈ జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తీకస్నానం చేసినవారికి పుణ్యప్రదం. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని విశ్వాసం.
స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తీక మాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణవ ఆలయాల్లోగానీ దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ, శివలింగ సన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయి.
కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ ఎవరు చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడవునా చేసినవాళ్లు జ్ఞానులై, మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది.
పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని విశ్వాసం.