Publish Date: Wed, 10 Feb 2021 (05:00 IST)
Updated Date: Tue, 09 Feb 2021 (19:27 IST)
వరాహ అవతారంలో జలప్రళయంలో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కోరల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఆది వరాహ స్వామి దేవాలయాలు చాలా అరదుగా ఉన్నాయి. చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినవి.. ఒకటి తిరుమల రెండవది, కరీంనగర్ జిల్లా కమానపూర్ గ్రామం (మండల కేంద్రం)లో ఒక బండ రాయిపై స్వామి వెలిసారు.
ఆది వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా పక్కనే ఉన్న మరో బండ పైన దర్శనం ఇస్తాయి. స్థల పురాణం ప్రకారం సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామి వారు కనిపించి ఏమి కావాలని కోరగా అప్పుడు మహర్షి ఇక్కడే కొలువై ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరగా అప్పుడు స్వామి వారు ఒక బండరాయి లో వెలిసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామి వారి బయటే ఉంటారు. ఎలాంటి మందిరం కాని, గోపురం కానీ ఉండదు.