Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ ప్రసంగాలన్నీ విభజన స్వభావం కలిగినవే : ప్రధాని మన్మోహన్

manmohan singh

ఠాగూర్

, గురువారం, 30 మే 2024 (16:45 IST)
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలన్నీ విభజన స్వభావం కలిగినవేనని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారని ధ్వజమెత్తారు. 
 
లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పంజాబ్‌ ఓటర్లకు ఓ లేఖ రాసిన మాజీ ప్రధాని.. విభజనవాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని.. గత పదేళ్లలో మోడీ విధానాల వల్ల రైతుల ఆదాయానికి గండి పడిందని దుయ్యబట్టారు.
 
'ఎన్నికల ప్రచారంలో రాజకీయ పరిణామాలను చూశా. మోడీజీ ప్రసంగాలన్నీ విభజన స్వభావం కలిగినవే. బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని, ప్రధానమంత్రి కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారు. ఓ వర్గాన్ని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని గతంలో ఏ ప్రధాని కూడా ఇటువంటి ప్రసంగాలు చేయలేదు. నాపైనా కొన్ని తప్పుడు ప్రకటనలు ఆపాదించారు. నా జీవితంలో ఎన్నడూ ఓ వర్గాన్ని వేరుగా చూడలేదు. అది భాజపాకే చెల్లింది' అని మాజీ ప్రధాని మన్మోహన్‌ పేర్కొన్నారు.
 
'దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు రూ.27 మాత్రమే. అదే ఒక్కోరైతుపై ఉన్న అప్పు మాత్రం రూ.27,000. ఇంధనం, ఎరువులతో సహా పెట్టుబడి అధికం కావడం, కొన్ని వ్యవసాయ ఆధారిత పనిముట్లపై జీఎస్టీ విధించడం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులపై విచిత్ర నిర్ణయాలు తీసుకోవడం వంటివి రైతు కుటుంబాల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీయడంతో సమాజంలో వారు అట్టడుగు స్థాయికి పడిపోయారు' అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విమర్శించారు.
 
ఢిల్లీ సరిహద్దులో కొన్ని నెలలపాటు ఆందోళన చేపట్టిన రైతుల్లో దాదాపు 750 మంది ప్రాణాలు కోల్పోయారని.. లాఠీలు, రబ్బరు బుల్లెట్లు చాలవు అన్నట్లుగా ఏకంగా ప్రధాని మోడీ వారిపై మాటల దాడికి దిగడం విచారకరమన్నారు. గడిచిన పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యిందన్న మాజీ ప్రధాని.. పెద్దనోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ విధానం, కొవిడ్‌ సమయంలో నిర్వహణ లోపం వంటివి దయనీయ పరిస్థితికి దారితీశాయని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్ల లెక్కింపు రోజున చిన్న అలజడి సృష్టించినా అరెస్టు చేయండి : మీనా ఆదేశం