Publish Date: Mon, 23 Mar 2020 (12:53 IST)
Updated Date: Mon, 23 Mar 2020 (12:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో పట్టణ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఇటీవల తెలంగాణాకు వచ్చిన ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రత్తమైంది.
ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కరోనా బాధితుడిని కలిసిన వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కాగా, కరోనా బాధితుడిని అధికారులు కరీంనగర్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా జిల్లాలో కరోనా రెండో దశకు చేరడంతో జిల్లా అధికార యంత్రాంగం హైఅలర్ట్ అయింది. సోమవారం సాయంత్రంలోగా ప్రభుత్వం కరీంనగర్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు, రాష్ట్ర ప్రజల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. కరోనా వైరస్ నియంత్రణకై ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది.
ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ ప్రకటనను ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇష్టారీతిన రోడ్లపై సంచరిస్తున్నారు. గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు.
ఈ నేపథ్యంలో లాక్డౌన్ అమలుపై సీఎస్, డీజీపీ అత్యవసర సమావేశం అయ్యారు. లాక్డౌన్ పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ నిబంధనలను పాటించని వారిపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీచేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.
ఠాగూర్
Publish Date: Mon, 23 Mar 2020 (12:53 IST)
Updated Date: Mon, 23 Mar 2020 (12:54 IST)