ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటారు. ప్రతి ఏడాది ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఛైత్ర శుద్ధ పాడ్యమి తిథి రోజున 30 మార్చి 2025 ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని మామిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.
ఈ రోజున శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ పండుగ వేళ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:30 గంటలకు కొత్త బట్టలు ధరించి.. ఉగాది పచ్చడి తయారు చేసుకుని తినడానికి శుభ సమయం అని పండితులు చెబుతున్నారు. విశ్వవాసు శాపం వల్ల గంధర్వుడు కబంధుడిగా మారిపోయాడు. రామాయణంలో కబంధుని ప్రస్తావన వస్తుంది.
అంతేకాదు ఉగాది రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి తదితర శుభప్రదమైన వస్తువులను కొనుక్కోవచ్చు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం 39వది. ఈ సమయంలో విశేష ధనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
పురాణాల ప్రకారం, నారదుడి 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని విష్ణువు వరం ఇస్తారు. ఆ 60 మంది పిల్లలే తెలుగు సంవత్సరాలని చెబుతారు. ఉగాది పచ్చడిని తప్పకుండా కుటుంబసభ్యులతో కలిసి తినాలని పురాణాలు చెబుతున్నాయి. మామిడికాయ, చింతపండు, బెల్లం, వేపపువ్వు, ఉప్పు, కారం కలిపి ఉగాది పచ్చడిని తయారుచేస్తారు.
ఉగాది రోజున కుటుంబసమేతంగా పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి తెలుగువారు అడుగుపెడుతున్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విశ్వానికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభసూచకం.