Publish Date: Mon, 29 Nov 2021 (09:54 IST)
Updated Date: Mon, 29 Nov 2021 (09:56 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్టణంకు వెళ్లిన ఆయన... సోమవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు.
కాగా, 1978 సంవత్సరం నుంచి శ్రీవారి సేవకు అంకితమైన శేషాద్రి.. 2007లో తితిదే ఉద్యోగిగా పదవీ విమరణ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఆఫీసర్ ఆన్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించింది. అప్పటి నుంచి ఆయన తిరుమలలో ఓఎస్డీగా కొనసాగుతున్నారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలోని ప్రతి అణువు ఆయనకు తెలియనది కాదు. వీవీఐపీలు వస్తే దగ్గరుండి వారికి అన్ని రకాల సేవలు చేసేవారు. ఈయన మృతి తితిదేకు తీరని లోటుగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అభిప్రాయపడ్డారు.