Publish Date: Thu, 18 Jul 2019 (17:12 IST)
Updated Date: Thu, 18 Jul 2019 (17:17 IST)
అస్సాంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు. నివాసాలకు ఇళ్లు లేకుండా సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అస్సాం వరదల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వర్షాలు కురుస్తూనే వున్నాయి. ప్రజలు తగిన వసతులు లేకుండా నానా తంటాలు పడుతున్నారు.
ఇక ఈ వరదల కారణంగా అటవీ ప్రాంతాల్లో వుండే వన్యమృగాలు సైతం ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. పాములు ఇళ్లల్లోకి చేరుకుంటున్నాయి. తాజాగా ఓ పులి వరద బాధితుల ఇంట్లోకి చొరబడింది. అక్కడే నివాసం వుంటోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కజిరంగ నేషనల్ పార్కు వుంచి ఈ పులి మానవ సంచార ప్రాంతానికి చేరుకుందని తెలుస్తోంది.
అంతేకాకుండా ఓ ఇంట్లోకి వెళ్ళిన పులి హాయిగా బెడ్ మీద కూర్చుండిపోయింది. ఇలా ఇంట్లోని పడకగదిలో హాయిగా పులిరాజు వున్న ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఇండియా అధికారులు పోస్టు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులిని పట్టుకుని అడవుల్లో వదిలేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.