Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం రోజున ఆ నలుగురిని ఇలా సుఖంగా సాగనంపారు

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం రోజున ఆ నలుగురిని ఇలా సుఖంగా సాగనంపారు
, శుక్రవారం, 20 మార్చి 2020 (12:11 IST)
పిచ్చుకల దినోత్సవం రోజున పైలోకాలకు
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో దొరికిన ప్రతి లోసుగులతో సుమారు రెండున్నర ఏళ్ళు బతుకే బండి లాగారు. తిహాడ్‌ కేంద్ర కారాగారంలో శుక్రవారం (నేటి) ఉదయం 5:30 గంటలకు నిర్భ‌య దోషులు ముకేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మల‌ను ఉరి తీశారు. అరగంట తర్వాత వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించ‌డంతో నిర్భయ హంతకుల జీవితం ముగిసిపోయింది. దేశ చరిత్రలో నలుగురు దోషులను ఒకే సమయానికి ఉరికొయ్యలకు వేలాడదీయటం ఇదే మొదటిసారి. 
 
ఉరితీత సందర్భంగా ఈ దోషుల ప్రవర్తన ఎలా ఉంది..? ఈ నీచులకు జరిగే ‘రాచ మర్యాదలు’ ఎలా ఉన్నాయి..? గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము 5.30గంటల వరకు ఈ దోషుల ఆఖరి ఘడియలు ఎలా ఉన్నాయి.? ఎలా గడిచాయి.? వారి అంతిమ క్షణాలు ఎంత భయంకరంగా గడిచాయి.? ఈ దౌర్భాగ్యులు చేసిన నీచమైన పనికి భారతదేశంలో 'ఉరి' తీసే తంతంగానికి ఓ 'సంప్రదాయం' బద్దంగా జరిగింది. ఎంత అన్యాయంగా చంపిన ఈ దుర్మార్గులను న్యాయబద్దంగా..జైలు నిబంధనల మేరకు వీలైనంత 'నొప్పి లేకుండా 'ప్రపంచ పిచ్చుకల దినోత్సవం' రోజున ఉరి' తీశారు. 
 
తెల్లారిన చావు తెలివితేటలు..
నిర్భయ దోషులను మార్చి 20న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు 'డెత్ వారెంట్' జారీచేసింది. దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని ఆదేశాలు జారీచేసింది. తీహార్‌ జైలులో ఉరిశిక్ష అమలు చేసే జైలు నెంబర్‌ 3కి చేరువలోకి జైలు అధికారులు ఈ నలుగురిని తరలించారు. అయితే బుధవారం సాయంత్రం నుంచి వారి ప్రవర్తనలో మార్పు కనిపించింది. దోషులను వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. సీసీ టివి ద్వారా వీరిని జైలు అధికారులు పర్యవేక్షించారు.

తీహార్‌ జైలు డైరెక్టరేట్‌ వర్గాల సమాచారం ప్రకారం… నలుగురు దోషులను ఒకేసారి ఉరిశిక్షకు తీసుకువెళ్ళారు. నలుగురు దోషులు ఎటువంటి ఇబ్బందులను సృష్టించలేని విధంగా అత్యంత అప్రమత్తతతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆసియాలో అతిపెద్ద జైలు అయిన తీహార్‌ జైలులో తలారి పవన్‌ జల్లాడ్‌ సహా అధికారుల బృందం మూడో కారాగారంలోని ఉరితీసే చోటును గురువారం పరిశీలించారు.
 
చివరిసారి ఉరి'తాడు’ పరీక్షలు..
ఉరి తీసేందుకు ఒక అంగుళం (రెండున్నర సెంటీవిూటర్ల) వ్యాసం, 19 అడుగుల పొడవు ఉండే 10తాళ్ళను బిహార్‌లోని బక్సార్‌ నుంచి ఇంతకు ముందే తీసుకొచ్చారు. ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్లు బరువు ఉండే ఇసుక బస్తాలతో వారం రోజుల ముందే ఒకసారి, గురువారం మరోసారి పరీక్షించారు. అలాగే ఒకొక్కరికి రెండు ఉరి తాళ్ళ చొప్పున ఎనిమిది తాళ్ళను, అదనంగా మరో రెండు ఉరితాళ్ళను పరీక్షించారు. అనంతరం వాటిని ప్రత్యేక లాకర్‌లో లాక్‌ చేశారు.
 
రాత్రిపూట భారంగా..
ఉరి ఖైదీలు ముకేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మలకు ప్రతిరోజులాగే ఒకరి తర్వాత ఒకరికి.. వేర్వేరుగా వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఈ నలుగురు వారి చివరి కోరిక ఏమిటో ప్రత్యేకంగా చెప్పలేదు. వారి ముఖాల్లో భయం, కుంగుబాటు లేదు. తప్పుచేశామనే పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. వీలునామా రాసే అవకాశం ఉన్నా ఆ వైపు వారు ఆలోచన చేయలేదు. రాత్రికి ఈ నలుగురు ఖైదీలు ఎలాంటి కొత్త రకం భోజనం కోరలేదు. భోజనం, రోటీ ఏదీ తినకపోవటం గమనార్హం. అయితే మంచినీళ్ళు మాత్రం రెండుసార్లు తాగినట్లు తెలిసింది.
 
మరణ జాగరణ..
ఈ నలుగురు గురువారం రాత్రి అంతా నిద్రపోలేదని తెలిసింది. ఒకరకంగా వీరు 'మరణ జాగారణ' చేశారు. జైలు నిబంధనల ప్రకారం.. ఉరి తీసే ఖైదీలను శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు నిద్ర లేపారు. 10 నిమిషాల తర్వాత.. అంటే 2.40 స్నానం చేయాల్సిందిగా జైలు అధికారులు చెప్పారు. వీరు అన్య మనస్కంగా స్నానం ముగించారు. ఎస్పీ, డీఎస్పీ, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌, వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీలు ఉన్న సెల్‌ వద్దకు చేరుకున్నారు.

'డెత్ వారెంట్‌'లో ఉండే వివరాలతో ఈ నలుగురు ఖైదీల వివరాలను సరిపోల్చుకున్నారు. తరువాత ఈ ఖైదీలకు అతడి మాతృభాష హిందీలో 'అతను చేసిన నేరం ఏమిటి..?' విధించిన శిక్షకు సంబంధించిన తీర్పు, అమలు వారెంట్‌ను ఖైదీకి అర్థమైయ్యే బాషలో చదివి వినిపించారు. అనంతరం 20 నిమిషాలకు అనగా సరిగ్గా తెల్లవారుజామున 3గంటలకు ఖైదీలకు అల్పాహారం అందించారు. అయితే ఈ నలుగురు ఎలాంటి అల్పాహారం తీసుకోలేదు.
 
'చావు' దగ్గరకు ఇలా..
అల్పాహారం తీసుకోపోవడంతో.. 'ఏదైనా మతపరమైన పుస్తకం కావాలా..'అని అధికారులు ఈ నలుగురిని అడిగారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రార్థన చేసుకునే అవకాశం ఉన్నా.. వారిలో పైకి కనపడని భయాందోళనలతో అప్పటికే బిక్కచచ్చిపోయారు. పాలిపోయిన ముఖాలతో ఉన్నారు. అనంతరం డిప్యూటీ సూపరింటెండెంట్ సమక్షంలో 'సెల్‌'లోనే ఖైదీల చేతులకు వెనక నుంచి బేడీలు వేశారు.

ఒకొక్క ఖైదీని ఇద్దరు వార్డెన్‌లు భుజాలను పట్టుకొని 'ఉరి కంభం' వైపు నడిపించారు. ఈ ఖైదీలకు ముందు వైపు ఇద్దరు వార్డెన్‌లు, వెనుక వైపు ఇద్దరు వార్డెన్‌లు ప్రొటోకాల్ ప్రకారం ఉన్నారు. ఈ సమయంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌తో పాటు హెడ్‌ వార్డెన్, మరో ఆరుగురు వార్డెన్‌లు కూడా ఉన్నారు.
 
సిద్దంగా ఉరికంభం...
ఉరి కంభం దగ్గర అప్పటికే సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్, వైద్య అధికారి సిద్ధంగా ఉన్నారు. ఉరితీతకు ముందు జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినట్లు సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్‌కు వివరించారు. తరువాత ఈ నలుగురు ఖైదీలకు తలారీకి అప్పగిస్తారు. ఖైదీలను ఉరి కంభం కింద నిల్చొబెట్టే వరకు వార్డెన్‌లు ఆ నలుగురు ఖైదీల చేతులు పట్టుకొనే ఉన్నారు. ఉరికంభం వద్దకు ఖైదీని తీసుకెళ్ళారు. ఉరికంబం ఎక్కించారు. ఆ తర్వాత ఉరి తీసే సందర్భంగా కాళ్ళు కదలకుండా రెండు కాళ్ళను చిన్న తాడుతో గట్టిగా కట్టారు. అనంతరం నల్లటి ముసుగులు వేశారు. అయితే అరవకుండా నోటిలో గుడ్డలు పెట్టడం, నోటిని మూయటం కానీ చేయలేదు. 
 
శ్వాసకు చివరి సంకేతం... 
సరిగ్గా సమయం ఉదయం 5.30 అయ్యింది. మేజిస్ట్రేట్ టైం చూసుకొని.. సంకేతం ఇచ్చారు. ఆ నలుగురు ఖైదీల కాళ్ల కింద ఉన్న తలుపులు తెరుచుకునేలా తలారి 'లీవర్‌'ను లాగాడు. ఆ నలుగురి మెడకు ఉరితాడు బిగిసింది. 14 నుంచి 16 నిమిషాల వ్యవధిలో వారి శరీరాల కదలిక ఆగింది. అరగంట వరకు ఆ ఖైదీల శరీరాన్ని అలాగే ఉంచారు. అనంతరం ఖైదీ మరణించినట్టు వైద్యాధికారి ధ్రువీకరించారు. ఆ విషయాన్ని హోం శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేశారు. మృతదేహాల కోసం ఈ వార్త కథనం రాసే సమయానికి మాత్రం కుటుంబసభ్యులకు ఎవరూ జైలు వద్దకు చేరుకోలేదు.
 
ముగింపు ఇలా...
డిసెంబర్ 16, 2012న జరిగిన నిర్భయ సంఘటన... మార్చి 20, 2020న అనగా సరిగ్గా 7 సంవత్సరాల 4 నెలల 3 రోజులకు ఈ నలుగురి ఉరితీతతో ఓ నేర చరిత్ర కథ... 'ప్రపంచ పిచ్చుకల దినోత్సవం' రోజున ముగిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మహమ్మారికి చైనాయే కారణం.. డ్రాగన్‌పై విరుచుకుపడిన ట్రంప్