నేర చరితులపై అనర్హత వేయలేం.. పార్లమెంటే అడ్డుకోవాలి : సుప్రీంకోర్టు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై చార్జ్షీట్ దాఖలైవున్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా కేసుల్
Publish Date: Tue, 25 Sep 2018 (11:54 IST)
Updated Date: Tue, 25 Sep 2018 (11:55 IST)
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై చార్జ్షీట్ దాఖలైవున్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా కేసుల్లో దోషులుగా తేలకముందే వారిని అనర్హులుగా ప్రకటించాలా? లేదా? అన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం ధర్మాసనం మంగళవారం తుది తీర్పును వెలువరించింది.
చార్జ్షీట్ ఉన్నంత మాత్రాన ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించలేమని తెలిపింది. ఈ విషయంలో పార్లమెంట్ కఠిన చట్టాలు చేయాలని పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచన చేసింది. అయితే, అభ్యర్థులందరూ పెండింగ్ కేసుల వివరాలు వెల్లడించాలని వెల్లడించింది. రాజకీయ అవినీతి ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
కాగా, వచ్చే నెల 2వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. నేరారోపణలు, ఆర్థిక నేరాభియోగాలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంలో తాము ఎటువంటి ఆదేశాలనూ ఇవ్వలేమని, అభ్యర్థుల అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.