Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల వెంకన్నపై ఆన... ఏపీకి హాదా ఇచ్చితీరుతాం... రాహుల్

Advertiesment
Rahul Gandhi
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (19:51 IST)
తిరుమల వెంకన్న సాక్షిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఓ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ అయిన ప్రత్యేక హోదాను ఇచ్చితీరుతామని స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోజాలదన్నారు. 
 
శుక్రవారం ఆయన కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామన్నారు. 
 
'ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. ప్రత్యేక హోదా కేవలం ప్రధాని ఇచ్చిన వాగ్దానం కాదు.. దేశంలోని ప్రతిపౌరుడు ఏపీకి ఇచ్చిన వాగ్దానంగా భావిస్తున్నాం. ప్రధాని ఒక వ్యక్తి కాదు.. కోట్లాది మందికి ప్రతినిధి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రపంచంలో.. ఏ శక్తి కూడా ప్రత్యేక హోదాను అడ్డుకోలేదు' అని స్పష్టం చేశారు. 
 
మోడీ ఇప్పటి వరకు ఒక్క వాగ్ధానం కూడా అమలు చేయలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. రాఫెల్‌ విషయంలో అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని, కాపలాదారుడే దొంగ అని ప్రజలు అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సత్యాలే చెబుతుందని స్పష్టం చేశారు. మోడీ పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేశారని, రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవచ్చు.. ఎలా?