Publish Date: Wed, 18 Aug 2021 (20:46 IST)
Updated Date: Wed, 18 Aug 2021 (20:48 IST)
ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఏపీసీసీ అధ్యక్షుడిగా, పలు శాఖలకు మంత్రిగా పని చేసి.. కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో అంత బిజీగా గడిపిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. ప్రస్తుతం అవన్నీ వదిలేసి ప్రకృతి మధ్య గడుపుతూ వ్యవసాయానికే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలో తన పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.
గ్రామీణ సంప్రదాయాలను తాను పాటించడమే కాకుండా తన మనువరాలికి కూడా పరిచయం చేస్తున్నారు. తన ఆరో ప్రాణమైన ముద్దుల మనువరాలు సమీరారెడ్డికి గ్రామీణ వస్త్రధారణ చేయించి.. వ్యవసాయరంగంపై తనకున్న మక్కువను మనువరాలితో పంచుకున్నారు.
బుధవారం ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మనువరాలితో సరదాగా గడిపారు. రెండు నెలలుగా స్థానికంగా ఆలయ నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన రఘువీరా.. బుధవారం నుంచి మళ్లీ వ్యవసాయంపై దృష్టి పెట్టారు. మనువరాలికి గ్రామీణ నేపథ్యం గురించి తెలియజేయాలనే రఘువీరా తపన.. గ్రామస్తులందరినీ ఆకట్టుకుంది.
సినిమాల్లో బాలనటులను మించిన అందంతో మెరిసిపోతున్న ఈ అమ్మాయి ఫొటోలకు నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. చాలా ముద్దుగా ఉందని, మొహంలో తేజస్సు అద్భుతంగా ఉందని వారి హృదయస్పందనలు రాసేస్తున్నారు. ట్విట్టర్లో పెట్టిన వెంటనే చాలా మంది కామెంట్ల మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన మనవరాలు సమైరాతో కలిసి పొలం దగ్గర దిగిన హై రిజల్యూషన్ ఫోటోలను రఘువీరారెడ్డి ట్విట్టర్లో షేర్ చేసి సమైరాను నెటిజన్లకు పరిచయం చేశారు.
సెల్వి
Publish Date: Wed, 18 Aug 2021 (20:46 IST)
Updated Date: Wed, 18 Aug 2021 (20:48 IST)