Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అస్సలామాలేకుం.. మిమ్మల్ని చూస్తే గర్వంగావుంది... ఎయిర్ ఇండియాపై పాక్ ప్రశంసలు

అస్సలామాలేకుం.. మిమ్మల్ని చూస్తే గర్వంగావుంది... ఎయిర్ ఇండియాపై పాక్ ప్రశంసలు
, ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (11:49 IST)
నిత్యం కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్.. ఈ దఫా మాత్రం భారత వైమానిక సిబ్బందిపట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలు ప్రదర్శించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన క్లిష్ట సమయంలో కూడా ఎయిర్ ఇండియా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపింది. ముఖ్యంగా, విదేశాల్లో చిక్కున్న భారతీయులను స్వదేశానికి తీసుకునిరావడంలోనూ, వివిధ దేశాలకు అత్యవసర వైద్య పరికరాలను చేరవేయడంలోనూ సహాయం చేసింది. ఇందుకోసం 18 ప్రత్యేక విమాన సర్వీసులను నడిపింది. 
 
విపత్కర పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా పైలెట్లు చూపిన తెగువ, ధైర్యసాహసాలను అనేక ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా చేరిపోయింది. ఎయిర్ ఇండియాను చూస్తుంటే, తమకు చాలా గర్వంగా ఉందని, ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితస్థితి పెరిగిపోయిన నేపథ్యంలో ఆ సంస్థ అమోఘమైన కృషి చేస్తోందని కొనియాడింది. 
 
తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాలకు తమ గగనతలం వాడుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాకుండా, ఆ విమానాలను నడిపిన పైలట్లను కూడా ప్రత్యేకంగా అభినందించింది. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. భారత్ అంటే నిత్యం విషం వెదజల్లే పాకిస్థానీయులు.. భారత పైలట్ల పట్ల అలా ఎందుకు ప్రేమ చూపారో తెలుసుకుందాం. 
 
ఈ నెల రెండో తేదీన ముంబై నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాలు వైద్య సహాయక సామాగ్రితో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బయలుదేరాయి. ఈ రెండు విమానాలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. 
 
అపుడు విమాన పైలెట్లు పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించి తొలుత విఫలమయ్యారు. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ మార్చి మరోమారు కాంటాక్ట్ కాగా, అపుడు అందుబాటులోకి వచ్చారు. అపుడు పాకిస్థాన్ ఏటీసీ నుంచి భారత పైలెట్లకు ఓ సందేశం వచ్చింది. దాన్ని చూసిన పైలెట్లు ఆశ్చర్యపోయారు. 
 
"అస్సలామాలేకుం. కరాచీ కంట్రోల్ ఎయిర్ ఇండియా సహాయక విమానాలకు స్వాగతం పలుకుతోంది" అని పంపించారు. ఆ తర్వాత ఫ్రాంక్ ఫర్ట్‌కు రిలీఫ్ విమానాలను తీసుకెళుతున్నామని కన్ఫార్మ్ చేయమని కోరగా, ఎయిరిండియా పైలెట్లు తాము వెళుతున్న ప్రదేశం, తీసుకెళుతున్న వస్తువులు, విమానం తదితర వివరాలను నిర్ధారించారు. 
 
అలా కన్ఫార్మ్ చేసిన తర్వాత... 'మహమ్మారి విస్తరించిన వేళ, మీరు విమానాలను నడిపిస్తుండటాన్ని చూసి మేము గర్వపడుతున్నాము. గుడ్ లక్' అన్న సందేశం పాక్ ఏటీసీ నుంచి వచ్చిందని దానికి తాము కూడా థ్యాంక్యూ వెరీమచ్ అంటూ సమాధానం ఇచ్చినట్టు ఓ విమానం నడిపిన పైలట్ తాజాగా వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అంతేకాకుండా, పాకిస్థాన్ ఎయిర్ బేస్‌ను వాడుకున్న కారణంతో 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత విమానాలకు పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ సాయం ఆపైనా కొనసాగిందని, పాకిస్థాన్‌ను దాటిన తర్వాత ఇరాన్ గగనతలంలోకి భారత విమానాలు ప్రవేశించిన వేళ, ఆ సమయంలోనూ ఏటీసీతో సంబంధం దొరకలేదని, అప్పుడు పాక్ ఏటీసీ మరోసారి సహకరించిందని ఎయిర్ ఇండియా పేర్కొంది. పాక్ నుంచి ఇరాన్ అధికారులకు సమాచారం వెళ్లిందని, వాస్తవ పరిస్థితుల్లో ఇరాన్ గగనతలంపై ఎక్కువ సేపు విమానం ప్రయాణించాల్సి వుంటుందని, కానీ, ఎయిర్ ఇండియా విమానాలకు షార్ట్ రూట్‌ను ఇచ్చారని తెలిపారు.
 
అలాగే, టర్కీ, జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ నుంచి కూడా సహకారం, ప్రశంసలు అందాయని, దీంతో షెడ్యూల్ ప్రకారం, ఉదయం 9.15 గంటలకు ఫ్రాంక్ ఫర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన విమానం, ఉదయం గం.8.35కే ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా పేర్కొంది. కాగా, దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం నడిపిన తొలి రెండు విమాన సర్వీసులు ఇవే కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విధులకు సిద్ధంగా ఉండాలి... 17 జోన్లకు రైల్వే శాఖ ఆదేశాలు