Publish Date: Wed, 06 Jul 2022 (10:02 IST)
Updated Date: Wed, 06 Jul 2022 (17:13 IST)
ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జరిగిన చిరస్మరణీయ కార్యక్రమం నుండి ముఖ్యాంశాలను పంచుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ట్విట్టర్ పేజీలో భీమవరంలో ఆయన పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసారు. ఇందులో మేము ధైర్యవంతులైన అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పించామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో నిన్న చిరస్మరణీయంగా జరిగిన కార్యక్రమ ముఖ్యాంశాలను వివరిస్తూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు.
ఇకపోతే.. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ ఏపీలోని భీమవరంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్లు హాజరయ్యారు.
ఇక భీమవరం సమీపంలోని మొగల్తూరులో జన్మించిన టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో చిరు ట్వీట్ చేశారు.
మొత్తం నాలుగు ఫొటోలను తన ట్వీట్కు జత చేసిన చిరంజీవి... అల్లూరి విగ్రహావిష్కరణకు కేంద్రం తనను ఆహ్వానించడం, ఆ కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఇక నాలుగు ఫొటోల్లో ఒకటి మోదీ తనను ఆత్మీయంగా పలకరిస్తున్న ఫొటో కాగా... మరొకటి జగన్ తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోగా ఉంది. మరో ఫొటోలో కూర్చున్న మోదీకి జగన్ చూస్తుండగా చిరు నమస్కరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకోవడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ కూడా ఆమెతో వున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సెల్వి
Publish Date: Wed, 06 Jul 2022 (10:02 IST)
Updated Date: Wed, 06 Jul 2022 (17:13 IST)