Publish Date: Mon, 04 Jul 2022 (16:35 IST)
Updated Date: Tue, 05 Jul 2022 (13:47 IST)
మెగాస్టార్ చిరంజీవిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన భుజం తట్టి మరీ భావోద్వేగంతో మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఏపీ మంత్రి రోజా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం జగన్తో కలిపి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
ఇదే వేదికపై ఉన్న చిరంజీవిని ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు అభివాదం చేసేందుకు ప్రధాని మోడీ వేదిక ముందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడే నిలబడివున్న జగన్.. ముందుకు వచ్చేందుకు సంశయిస్తున్నట్టుగా కనిపించారు. దీన్ని గమనించిన మోడీ సీఎం జగన్ చేయపట్టి మరీ ముందుకు పిలిచారు.
ఆ తర్వాత తనకు శాలువా కప్పి సత్కరించేందుకు వచ్చిన చిరంజీవితో మోడీ కాస్తంత ఉద్వేగంగా నుడుచుకున్నారు. చిరు భుజం తట్టి మరీ ప్రోత్సహిస్తున్నట్టుగా మాట్లాడిన మోడీ... ఓ నిమిషం పాటు చిరుతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. మోడీ చెప్పిన మాటలను విన్న చిరు ఉద్వేగంతో మోడీకి నమనస్కరించారు. చిరుతో మాట్లాడుతున్నంతసేవు మోడీ ఆయన చేతులను విడిచిపెట్టేనే లేని దృశ్యం ఆసక్తి రేకెత్తించింది.