మిస్సైల్ లాంటి పదాలతో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న 'గబ్బర్ సింగ్'
స్పీచ్లో బేస్.. మాట్లలో గ్రేస్.. ప్రజల్లో క్రేజ్.. సినిమాలు వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలతోనే తూటాలు పేల్చుతున్నారు. ఆయన తాజాగా చేపట్టిన ప్ర
Publish Date: Thu, 24 May 2018 (17:02 IST)
Updated Date: Thu, 24 May 2018 (17:21 IST)
స్పీచ్లో బేస్.. మాట్లలో గ్రేస్.. ప్రజల్లో క్రేజ్.. సినిమాలు వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలతోనే తూటాలు పేల్చుతున్నారు. ఆయన తాజాగా చేపట్టిన ప్రజా పోరాట యాత్ర రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాలకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆయన దండయాత్ర మొదలుపెట్టారు. మిస్సైల్ లాంటి పదాలతో ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ.. ఉత్తరాంధ్ర యూత్ గుండెల్లో జనసేన ముద్ర పడేలా కేక పుట్టిస్తూ దూకుడుతో దూసుకు పోతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్రకు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. పోరాట యాత్రకు అటు పవన్ అభిమానులు ఇటు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నేరుగా ప్రజల వద్దకు వెళ్తూ, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు.
అంతేనా.. మధ్యమధ్యలో అభిమానులు చేస్తున్న సీఎం నినాదాలకూ స్పందిస్తున్నారు. కేవలం నినాదాలు చేస్తే సరిపోదనీ, ఎన్నికల్లో మీ బాధ్యతను నిర్వహించాలని గుర్తు చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో నినాదాలు చేసే యువత జనసేనకు ఓటు వేయాలంటూ పరోక్షంగా సూచన చేస్తున్నారు.
ముఖ్యంగా, ఈ యాత్రలో ఆయన మిస్సైల్ లాంటి మాటలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు. తెలుగుదేశం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన పవన్.. ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫలితంగా అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక బీజేపీపై కూడా పవన్ తనదైనశైలిలో విరుచుకు పడుతున్నారు.
అదేసమయంలో పవన్ పోరాట యాత్రకు ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దత్తు లభిస్తోంది. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని.. ప్రజలు తమను ఆదరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్న పవన్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి 2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేనాని.. పోరాట యాత్ర విజయవంతం అయితే ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్గా మారుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ, జనసేన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కింగే అవుతారనీ, కింగ్ మేకర్ కాబోరని వ్యాఖ్యానిస్తున్నారు.