Publish Date: Fri, 11 Jan 2019 (12:21 IST)
Updated Date: Fri, 11 Jan 2019 (12:25 IST)
టాలీవుడ్లో నందమూరి హీరో బాలయ్య మెగా సోదరుడు నాగబాబుల వివాదం ఇంకా ముగిసినట్లు లేదు. బాలయ్యపై ప్రస్తుతం స్పందించేందుకు ఎలాంటీ రాజకీయ కారణాలు లేవని.. నాగబాబు తాజాగా స్పష్టం చేశారు. మిగిలిన నేతలు, వ్యక్తులకు రాజకీయ ఉద్దేశాలు వుండవచ్చునని.. తమకు అలాంటివి లేవని తేల్చేశారు. విమర్శలను భరించి భరించి ఒళ్లు మండిపోయి ప్రస్తుతం స్పందిస్తున్నామని నాగబాబు అన్నారు.
ఇంట్లో దొంగతనం చేసినావడైనా.. మనపై దాడి చేసిన వాడు ఏడాది తర్వాత దొరికినా వదిలిపెట్టం కదా అంటూ నాగబాబు తెలిపారు. తమకంటూ సంస్కారం వుండబట్టే ప్రతీ అడ్డమైన దానికి రియాక్ట్ కాలేదని నాగబాబు చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోడని వ్యాఖ్యానించారని.. ఈ వ్యాఖ్యలతో తమకు చాలా బాధ కలిగిందన్నారు. దీనిపై చిరంజీవి అప్పట్లో బాలయ్య చిన్నపిల్లాడని.. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదన్నారనే విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు.
రిక్షా తొక్కే వ్యక్తి ఆయన కొడుక్కి గొప్ప కావొచ్చనీ, బాలయ్య తన తండ్రి గొప్పతనాన్ని కీర్తించుకోవడం ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. అయితే పక్కనవారిని అవమానించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా నాగబాబు ఆరో వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో ఇకపై తాను బాలయ్య జోలికి రాబోననీ, కానీ తమ కుటుంబాన్ని మరోసారి విమర్శిస్తే తాను మళ్లీ రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. దయచేసి మాట్లాడేటప్పుడు నోరును అదుపులో పెట్టుకోండంటూ నాగబాబు తెలిపారు.