Publish Date: Sun, 06 Jan 2019 (14:01 IST)
Updated Date: Sun, 06 Jan 2019 (14:03 IST)
భారతీయ జనతా పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పుల గురించి కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత సంఘ్ ప్రియా గౌతమ్ రాసిన లేఖ ఇపుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీని దేశ ఉప ప్రధానమంత్రిగా నియమించాలని ఆయన కోరారు. అంతేకాకుండా, కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన తన లేఖలో కోరారు.
అలాగే, భాజపా అధ్యక్షుడు అమిత్షా రాజ్యసభపై ఎక్కువ దృష్టి సారించాలని, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను భాజపా అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని కోరారు. 88 ఏళ్ల సంఘ్ ప్రియా... అటల్ బిహారీ వాజ్పేయీ హాయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఇప్పటివరకూ చక్రం తిప్పిన అగ్ర రాజకీయ నాయకులందరిలో మోడీ కూడా ఉంటారని, ఆయన హవా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కొన్ని మినహా ఎక్కువ రాష్ట్రాల్లో భాజపానే విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.