Publish Date: Fri, 16 Aug 2019 (16:09 IST)
Updated Date: Fri, 16 Aug 2019 (16:12 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370వ అధికరణనను రద్దు చేయడాన్ని పాకిస్థాన్ యాగీ చేస్తోంది. దీన్ని అడ్డు పెట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరిక చేశారు. అవసరమైతే అణుదాడికి కూడా ఏమాత్రం వెనుకాడబోమని హెచ్చరించారు.
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొలి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్లో రాజ్నాథ్ నివాళి అర్పించారు. పోఖ్రాన్లోనే భారత్ రెండు అణు పరీక్షలను (1974, 1998 సంవత్సరాల్లో) నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరు తొందరపడినా.. తాము అణ్వాయుధాన్ని ప్రయోగించరాదు అన్న సిద్ధాంతానికి భారత్ కొన్నేళ్లుగా కట్టుబడి ఉంది. కానీ భవిష్యత్తు పరిణామాల దృష్ట్యా ఆ విధానం మారే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.
భారత్ను న్యూక్లియర్ పవర్ చేయాలనేది తమ ప్రాధాన్యతాంశమని... ఇది భారత పౌరులంతా గర్వపడే విషయమని... ఇదే సమయంలో అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామన్నారు.