Publish Date: Sat, 30 Oct 2021 (21:28 IST)
Updated Date: Sat, 30 Oct 2021 (21:32 IST)
స్వల్ప ఉద్రిక్తల నడుమ హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. దీనితో ఇప్పుడు గెలుపు ఎవరదన్న దానిపై విపరీతంగా చర్చ జరుగుతోంది. Huzurabad By Election Exit Poll ఫలితాలు కూడా బయటకు వచ్చేసాయి. భాజపా వైపే ఓటర్లు మొగ్గు చూపారని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. హోరాహోరీ పోటీ తథ్యం అంటున్నాయి. ముఖ్యంగా యువత కమలం వైపే మొగ్గుచూపినట్లు చెపుతున్నారు.
కాగా హుజూరాబాద్ ప్రజలు ఒక్కరు కూడా బీరుపోకుండా ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి కనిపించారు. సాయంత్రం 5 గంటలకే 76 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషనర్ గోయల్ తెలిపారు.
గత ఎన్నికల్లో ఇక్కడ 86.28% ఓటింగ్ నమోదైంది. ఈసారి అది 90 శాతానికి పైగా వుంటుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని చూసి అటు తెరాస, ఇటు భాజపా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రజలు ఏదో ఒక పార్టీకి మూకుమ్మడిగా ఓట్లు వేసేశారనే టాక్ వినిపిస్తోంది.
ప్రగతి భవన్ అహంకారాన్ని బొందపెడదాం.. హుజూరాబాద్ ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాం అని తన పిలుపు మేరకు ప్రజలు తమ పార్టీకే ఓట్లు వేస్తున్నారని ఈటెల రాజేందర్ అంటున్నారు. ఐతే ఈటెలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకే ప్రజలు పెద్దఎత్తున ఓటింగులో పాల్గొంటున్నారని తెరాస చెపుతోంది. మరి గెలుపు ఎవరిదన్నది సస్పెన్సుగా మారింది.