Publish Date: Thu, 18 Nov 2021 (21:22 IST)
Updated Date: Thu, 18 Nov 2021 (23:05 IST)
ఎపిని వర్షాలు వణికిస్తున్నాయి. తిరుపతి, తిరుమలను వర్షం ముంచెత్తుతోంది. దీంతో టిటిడి ఘాట్ రోడ్లతో పాటు కాలినడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఘాట్ రోడ్ల నుంచి కొండచరియలు విరిగి పడుతుండడంతో ఘాట్ రోడ్లను ఉన్నట్లుండి మూసివేసింది.
గత రెండురోజుల నుంచి కాలినడక మార్గాన్ని టిటిడి మూసేసి వుంచింది. వర్షం కారణంగా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం.. కాలినడక మార్గంలోకి వర్షపు నీరు రావడంతో భక్తులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున రెండురోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే వర్షం ఏమాత్రం తగ్గకపోవడంతో మరో రెండు రోజుల పాటు కాలినడక మార్గాలను మూసివేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం రెండు కాలినడ మార్గాలు తిరుమలకు ఉన్నాయి. ఒకటి అలిపిరి కాలినడక మార్గం, మరొకటి శ్రీవారి మెట్టు మార్గం. రెండు మార్గాలను రెండురోజుల పాటు మూసే ఉంచనున్నారు.
అలాగే ఘాట్ రోడ్లను కూడా ఉన్నట్లుండి టిటిడి మూసివేసింది. వర్షం అలాగే కొనసాగితే ఘాట్ రోడ్లను కూడా తెరిచే అవకాశం కనిపించడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.