పవిత్రమైన దేవాలయాల్లో ఇటీవలి కాలంలో పాడుపనులు చేసేవారు ఎక్కువవుతున్నారు. దేవాలయంలో భక్తిశ్రద్దలతో ఆ భగవంతుడిని దర్శించుకుని వెళ్తుంటారు భక్తులు. కానీ ఈమధ్య కాలంలో దేవాలయాలలో కూడా రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం వెంపర్లాడేవారు ఎక్కువయ్యారు. గుడిలో అలాంటి పనులు చేయకూడదనే ఇంగితజ్ఞానం కూడా వుండటంలేదు.
ఇక అసలు విషయానికి వస్తే... గుడిలో జరిగిన ఓ విషయాన్ని వీడియో ద్వారా తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఓ నెటిజన్. ఆ వీడియోలో... ఆలయ ప్రాంగణంలో కొత్తగా పెళ్లయిన భార్య నిలబడి వుండగా ఆమె భర్త హఠాత్తుగా ఆమె కాళ్లపై పడి ఆపై మోకాళ్లపై నిలబడి చేతులు చాస్తూ కనిపించాడు. ఆలయ ప్రాంగణంలో అతడలా యువతి కాళ్లపై పడి నమస్కారాలు పెట్టడం చూసినవారు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఐతే ఓ బామ్మ మాత్రం తన కోపాన్ని ఆపుకోలేకపోయింది.
వెంటనే వారినుద్దేశించి... గుడిలో ఇలా చేయడానికి సిగ్గులేదూ. దేవాలయంలో దేవతల కాళ్లపై మాత్రమే పడాలి. ఇక్కడ మనుషులెవరికీ కాళ్లపై పడి దణ్ణాలు పెట్టకూడదు. ఆమాత్రం బుద్ధి కూడా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సదరు కపుల్స్ మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. పళ్లికిలిస్తూ, వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.