Publish Date: Wed, 19 Dec 2018 (12:37 IST)
Updated Date: Wed, 19 Dec 2018 (12:38 IST)
దివంగత అన్నాడీఎంకే నేత జయలలిత జీవిత కథ ఆధారంగా బయోపిక్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవితంలో ఎన్నో అనూహ్య మలుపులు వున్నాయి. అలాంటి ఆమె జీవితచరిత్రను ఆవిష్కరించడానికి తమిళ దర్శకులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఒకవైపున దర్శకురాలు ప్రియదర్శిని.. మరోవైపు భారతీరాజా ఆ ప్రయత్నాల్లో వున్నారు.
ఈ నేపథ్యంలో జయలలిత జీవిత చరిత్రను ధారావాహికగా తీసేందుకు గౌతమ్ మీనన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ధారావాహికకు ఆయనే దర్శకత్వం వహిస్తాడా లేకుంటే నిర్మాతగా మాత్రమే వుంటాడా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అందుకు సంబంధించిన సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. జయలలిత జీవిత కథ ఆధారంగా తీయనున్న ధారావాహికను 30 ఎపిసోడ్స్గా తెరకెక్కించనున్నారు.
జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణ పాత్రను తీసుకోనున్నారని తెలిసింది. టీవీలో ప్రసారమయ్యే ఈ ధారావాహిక.. వెబ్ సిరీస్ రూపంలో అందుబాటులో వుంటుందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ధారావాహికలో రంజిత్, వినిత ఎంజీర్, శశికళ పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.