Publish Date: Wed, 19 Dec 2018 (12:24 IST)
Updated Date: Wed, 19 Dec 2018 (12:26 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమికి చంద్రబాబే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
నిన్నామొన్నటివరకు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, ఇపుడు చంద్రబాబు ప్రచారం వల్లే ఓడిపోయామని అంటున్నారని, కూటమి ఓటమి పట్ల ఆయన తప్పేమీ లేదన్నారు. ఓటమికి గల అసలు కారణాలను టీ కాంగ్రెస్ నేతలు గ్రహించలేక పోతున్నారన్నారు.
తెలంగాణ ప్రజలు మొదటి నుంచి తెరాస వెంటే ఉన్నారని, ఈ విషయం తమకు తెలుసునని, చంద్రబాబు వచ్చినా, మరెవరు వచ్చినా ప్రజల మనసుల నుంచి కేసీఆర్ను తొలగించలేకపోయారన్నారు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్న కారణంగానే తెరాసకు మరోమారు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు.