Publish Date: Wed, 13 Oct 2021 (19:21 IST)
Updated Date: Wed, 13 Oct 2021 (19:23 IST)
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్ వైద్యుల బృందం మాజీ ప్రధానికి చికిత్సలు అందిస్తున్నది. జ్వరంతో పాటు శ్వాస సమస్యలు, గుండె నొప్పిగా ఉండటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఏప్రిల్ 19వ తేదీన మన్మోహన్ సింగ్ కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. జ్వరం ఉండడంతో ఎయిమ్స్లో చేర్పించిన సమయంలో కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అంతకుముందు మార్చి 4న, ఏప్రిల్ 3న కొవిడ్ టీకా తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మన్మోహన్ సింగ్ ఓ మంచి ఆర్థికవేత్త కూడా. ఆయన భారత రిజర్వు బ్యాంకు గవర్నరుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2004-2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. 2009లో ఎయిమ్స్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.