Publish Date: Wed, 13 Oct 2021 (19:14 IST)
Updated Date: Wed, 13 Oct 2021 (19:19 IST)
దేశంలో వంటనూనెల ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో సగటు జీవి ఈ ధరల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతున్నాడు. దీనికితోడు ఇతర కిరాణా సరకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్ను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది. రిఫైన్డ్ వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఇప్పటివరకు 32.5 శాతం ఉండగా, ఇప్పుడది 17.5 శాతానికి తగ్గించింది.
అలాగే, పామాయిల్పై అగ్రిసెస్ 7.5 శాతానికి తగ్గగా, ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెపై అగ్రిసెస్ 5.5 శాతానికి తగ్గింది. ఈ ఎత్తివేత, తగ్గింపులు అక్టోబరు 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. తదుపరి మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వంట నూనెల ధరలు బాగా తగ్గనున్నాయి. దేశంలో దసరా, దీపావళి సీజన్ లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు కాస్త ఊరట కలిగించనుంది.