Publish Date: Sun, 10 Nov 2019 (11:44 IST)
Updated Date: Sun, 10 Nov 2019 (11:31 IST)
వివాదాస్పద అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు శనివారం తెరదించింది. వివాదాస్పద అయోధ్య భూమిని రామజన్మభూమి న్యాస్కే కేటాయించాలని, మసీదు నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్పందించారు.
ఈ తీర్పుతో హిందువుల చిరకాల కోరికైన అయోధ్య రామమందిర నిర్మాణ కల సాకారం కానుందని అన్నారు. తన దశాబ్దాల కల నెరవేరిందని, భారత సాంస్కృతిక, వారసత్వ సంపదలో రామజన్మభూమిది ప్రత్యేకమైన స్థానమని అన్నారు.
కోట్లాది మంది నమ్మకాలను నిలుపుతూ వచ్చిన ఈ తీర్పు తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఇకపై ఎటువంటి హింసకూ తావులేకుండా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సి వుందని అద్వానీ అభిప్రాయపడ్డారు.
అన్ని వర్గాల ప్రజలూ ఒక్కటై దేశ ఐక్యతను, సమగ్రతనూ బలపరచాలని కోరారు. మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పునూ అద్వానీ స్వాగతించారు.