Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో 15 లక్షలు దాటిన కరోనా కేసులు.. రెండో స్థానానికి భారత్ పరుగు?

Advertiesment
Coronavirus
దేశంలో కరోనా వైరస్ సరికొత్త భయాందోళనలు రేకెత్తిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటి కంటే.. అన్‌లాక్ 2.0లోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 48,513 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 768 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం మొత్తం 15,31,669 లక్షలకు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 34,193కి పెరిగింది. 5,09,447 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,88,030 మంది కోలుకున్నారు. కాగా, మంగళవారం వరకు మొత్తం 1,77,43,740 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు  కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజులో 4,08,855 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
 
ఇకపోతే, ప్రపంచపు కరోనా కేసుల్లో రెండో స్థానం దిశగా ఇండియా పరుగులు పెడుతోంది. యూఎస్ఏలో 42 లక్షలకు పైగా కేసులుండగా, ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ 24 లక్షల పైగా కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. బ్రెజిల్‌ను దాటేసేందుకు ఇండియా ఇప్పుడు పరుగులు పెడుతోంది. 
 
తాజాగా ఇండియాలో కరోనా కేసులు 15 లక్షల మార్క్‌ను అధిగమించాయి. కరోనా కేసుల విషయంలో అత్యధిక పెరుగుదల నమోదవుతున్న దేశం భారత్ అంటే... దేశంలో ఈ మహమ్మారి ఎంతగా విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
 
ప్రస్తుతం రోజుకు దాదాపు 50 వేలకు పైగా కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియాలో మహమ్మారి ఇంకా వ్యాపిస్తోందని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. కరోనా ప్రపంచాన్ని పట్టిన తర్వాత... ఇంకా చెప్పాలంటే, తొలి కేసు ఇండియాలో వచ్చిన తర్వాత నాలుగు నెలలకు లక్ష కేసులు రాగా, ఆపై రెండు నెలల వ్యవధిలోనే కేసుల సంఖ్య 15 లక్షలకు చేరడం గమనార్హం.
 
బ్రెజిల్‌తో పోల్చినా భారత్‌లో కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతూ ఉండటంతో కేసుల సంఖ్య విషయంలో ఆగస్టులోనే రెండో స్థానానికి ఇండియా చేరుతుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగైన స్థానంలో ఉందని నరేంద్ర మోడీ, మూడు రోజుల క్రితం తన 'మన్ కీ బాత్'లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 
ఇకపోతే, మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో దక్షిణ భారతంలోని రాష్ట్రాలే ఉన్నాయి. ముఖ్యంగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించి, కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెల చదువు కోసం విరామం లేని కొలువు ... నాన్‌స్టాప్‌గా 38 యేళ్లపాటు సర్వీసు