Publish Date: Mon, 05 Aug 2019 (16:22 IST)
Updated Date: Mon, 05 Aug 2019 (16:24 IST)
సరిగ్గా 10 రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ను వెంటబెట్టుకుని నేరుగా తన అన్న దగ్గరకు వెళ్ళాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ పరిస్థితితో పాటు ప్రస్తుతం రాజకీయంలో మెగా బ్రదర్స్ ఎలా ఉండాలన్న దానిపై సుదీర్ఘంగా మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చ కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే తన అన్నతో తాను ఏం మాట్లాడన్న విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు పవన్ కళ్యాణ్. మొదట్లో చిరంజీవిని జనసేనలోకి తీసుకొచ్చి పార్టీని పటిష్టం చేసి రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఆలోచనకు వచ్చారట పవన్ కళ్యాణ్. అయితే తనకు కాస్త సమయం కావాలని పవన్ కళ్యాణ్ వినతిని సున్నితంగా తిరస్కరించారు చిరంజీవి.
కానీ ఆ తరువాత బిజెపి అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపారనీ, తనతో పాటు పార్టీని విలీనం చేసి చిరంజీవికి కేంద్రంలో పెద్ద నామినేటెడ్ పదవి రాబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే చిరంజీవికి ఇది చికాకు పెట్టిందట.
కొన్ని సామాజిక మాధ్యమాల్లో చిరంజీవి బిజెపిలో చేరుతున్నారంటూ వార్తలు రావడంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పైన అసహనం వ్యక్తం చేశారట. నిన్న పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కు స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి మనపైన చెడు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతానికి నేను సినిమాల్లోనే బిజీగా ఉన్నాను. నాకు రాజకీయాలు వద్దు అంటూ.. ఇంకెప్పుడు రాజకీయం గురించి ప్రస్తావన కూడా నా దగ్గర తీసుకురావద్దంటూ పవన్ కళ్యాణ్కు చెప్పి ఫోన్ పెట్టేశారట చిరంజీవి.